subhashit



సుభాషితం-1                 
దేశ రక్షా సమం పుణ్యం - దేశ రక్షా సమం వ్రతం
దేశ రక్షా సమం యోగో - దృష్టో నైవచ నైవచ
భావం: దేశ రక్షణతో సమానమైన పుణ్యము, సమానమైన వ్రతము, సమానమైన యజ్ఞమును ఎక్కడనూ చూడలేము. అనగా దేశరక్షణే  సర్వశ్రేష్ఠ కార్యము.  
సుభాషితం-2                                          
తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై  కరి భంగి సర్వమున్
దెలిసితి నంచు గర్విత మతిన్  విహరించితి తొల్లి యిప్పుడు
జ్వల మతు లైన పండితుల సన్నిధి  నించుక  బోధ శాలి నై  
తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్
భావం: తెలివి కొంచేముకూడా లేనికాలము లో నేను అన్నీ నాకే తెలుసునని మదించిన ఏనుగు వలె సంచరించితిని. కానీ యిప్పుడు మహాత్ములైన పండితుల దగ్గర కొంత నేర్చుకొని నాకేమీ  తెలియదని. తెలుసుకొని గర్వమంతయు నశించి పోయి నడుచుకుంటిని.(భర్తృహరి సుభాషితము) ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ వున్న విస్తరాకు అణిగి మణిగి వుంటుంది అని సామెత పండిన పొలాలు ఎప్పుడూ  వంగి వుంటాయి.చదువు ఎప్పుడూ వినయాన్ని పెంచాలి అని కవి చెప్తున్నాడు.
సుభాషితం-3
దారిద్య్ర రోగ బంధన వ్యసనానిచ 
 ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
అర్థము: దారిద్య్రం , రోగం, దుఃఖం, బంధనం, వ్యసనం యివన్నీ పూర్వం మనం చేసిన దోషకర్మ(పాపములు) లనే వృక్షం నుంచి లభించిన విష ఫలాలే. కానీ మనము అమాయకంగా అన్యులెవరొ మన ఆపదలకు కారకులని ఆవేదన పడుతుంటాము. ఎంతటి వారైనా ఈ కాలభుజంగపు కాటుకు బలికావాల్సిందే.  అందుకే భారతం లో భీష్మాచార్యుడు యిలా అంటారు.
సుభాషితం-4                                
సౌజన్యం యది కిం బ లేన మహిమా యద్యస్తి కిం మండనై:
సద్విద్యా యది కిం ధనై పర యశో యద్యస్తి కిం మృత్యునా 
అర్థము:  అత్యాశ కలిగియున్న వేరు దుర్గుణం అక్కరలేదు, కొండెములు చెప్పుగుణం కలిగి వున్న నితర పాపము లేదు.సత్యము చెప్పు గుణమున్న వేరు తపస్సు అక్కరలేదు. మంచి మనస్సుకలిగి యున్న తీర్థ యాత్రలక్కరలేదు.శాంతము కలిగియున్న వేరు బలము అక్కరలేదు.మహిమ యుండిన భూషణం తో పనిలేదు. మంచి విద్య యున్న ధనముతో పని లేదు.అపకీర్తి కలిగిన మృత్యు వు తో పనిలేదు.(చావు తో పనిలేదు ).(భర్తృహరి సుభాషితము) 
సుభాషితం-5                                       
ఆలస్యహి మనుష్యాణాం శరీరస్థొ మహా రిపు:
వాస్తుద్యమ సమో బంధు:కృత్యాయం నానసేదతే
అర్థము: తమ బద్ధక స్వభావమే మనుషులకు పరమ శత్రువు. నిరంతరం పని మీద ధ్యాస కలవాడు నశించడు. కృషి పర్వతమును పోలిన ఆత్మబంధువు వేరే లేదు. "'కృషి తో నాస్తి దుర్భిక్షం" కృషి వుంటే మనుషులు ఋషులవుతారూ మహా పురుషులౌతారు". అన్నాడో సినీకవి. దుఃఖం సోమరితనానికి తోబుట్టువు. దుఖానికి కారణం యేమిటంటే మనం ఆనందంగా వున్నామా?లేదా? అని ఆలోచించే తీరిక వుండడమే. చీకూ చింతల్ని అలుపులేని శ్రమ లో ముంచేయడం కన్నా ఆనందం మరొకటి వుండదు.
సుభాషితం-6                              
ఈశావస్య మిదం సర్వం యత్కించిత్ జగత్యాంజగత్
తేన త్యక్తేన భుంజీంథా: మా గృథః కస్యస్విద్దనం 
భావం: ఈ ప్రపంచంలో ఉన్నదంతా పరమేశ్వరునిదే. కనుక అంతటిని ఆయనకు సమర్పించి మిగిలిన దానినే ప్రసాదం గా స్వీకరించాలి. ఇతరుల సంపదను ఎప్పటికి కోరరాదు.
సుభాషితం-7
వివేక: సహ సమ్యత్యా వినయో విద్యా సహ
ఫ్రభుత్వం ప్రష్ర్యోపేతం చిణమెతన్మహాత్మనాం
భావం: సంపద తో పాటు వివేకము, విద్యతో పాటు వినమ్రత, శక్తి తో పాటు సౌజన్యము ఉండటంతోనే మహాత్ములుగా (మహ పురుషులుగా) గుర్తింపబడతారు.
సుభాషితం-8
శ్రద్ధయా ధార్యతే ధర్మో బహుభిర్నార్థరాశిభిః|
నిష్కించనా హి మునయః శ్రద్ధావంతో దివంగతాః||
అర్థం. శ్రద్ధతో మాత్రమే ధర్మం అభివృద్ధి చెందుతుంది. ఎంత ధనమున్నా సంతలో , అంగళ్ళలో ధర్మాన్ని సంపాదించడం అసాధ్యం. ధనవంతులై ఉన్నా ధర్మంలో శ్రద్ధ లేకపోవడంతో కీర్తి పొందక సంసారంలో మునిగి తేలుతున్నారు. ఏమాత్రం ధనం లేని ఋషిమునులు శ్రద్ధతో ధర్మాచరణం చేస్తూ సద్గతి పొందారు. ధర్మానికి ధనం సహకారి మాత్రమే తప్ప ప్రధానం కాదు. - గరుడ పురాణం.
సుభాషితం-9
శండనైగమశ్రేణీ పూగ వ్రాత గణాధిషు|
సంరక్షేత్సమయం రాజా దుర్గే జనపదే తథా||
అర్థం: రాజు లేదా ప్రభుత్వానికి తన కోటను లేదా క్షేత్రాన్ని రక్షించవలసిన బాధ్యత ఎలాగైతే ఉంటుందో, అదే రీతిలో వేదాల పట్ల నమ్మకమున్నవారిని ( నైగమా ) , నమ్మక ముంచనివారిని ( పాశండి ) మరియు ఇతరులను రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
( ఈ అతి పురాతన శ్లోకం , వేదాలే సర్వోత్తమమని భావించబడిన సమయంలో కూడా ' వేదాల పట్ల ' నమ్మకం లేని వారిని కూడా గౌరవించాలని చెబుతోంది. సెక్యులరిజం అంటే నిజమైన అర్థం తెలుపుతోంది ఈ శ్లోకం. అనాది కాలం నుండి భారతదేశం సెక్యులరిజాన్ని పాటిస్తూ వస్తోందనడానికి ఈ శ్లోకం ఒక ఉదాహరణ. )
సుభాషితం-10
అత్రాపి భారతం శ్రేష్ఠం జంబూద్వీపే మహామునే|
యతోహి కర్మభూమ్యేషా తతోన్యాభోగభూమయః||
అర్థం: వివిధ దేశాలలో భారతదేశం శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఇది కర్మభూమి, ఇతర దేశాలు భోగభూములు. - విష్ణుపురాణం.
సుభాషితం-11
అహో అమీషాం కిమకారి శోభనం, అహో అమీషాం సౌభాగ్యమ్|
ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిః, యైర్జన్మ లబ్ధం నృషు
భారతాజిరేముకుందసేవౌపయికం స్పృహా హి నః||
అర్థం: దేవతలు ఇలా ఆలోచిస్తారు - ఈ భారతదేశంలో జన్మించేవారున్నారే ! వాళ్ళు ఏమంత పుణ్యం చేసి ఉంటారో? ఈ భారతదేశంలో జన్మించిన ప్రజల సౌభాగ్యమే మహాభాగ్యం. వాళ్ళు చేసిన పుణ్యం చాలా గొప్పదై ఉంటుంది .లేకపోతే సాధారణ పుణ్యానికి అక్కడ జన్మించడం సాధ్యం కాదు. ఈ భారతదేశంలో అవతరించినంత మాత్రానికే శ్రీహరి అంత సంతోషపడతాడెందుకో ? పరమాత్ముడి సేవ కోసం అన్ని విధాలుగా యోగ్యమైన భారతదేశంలో జన్మ లభించినవారందరూ నిజంగానే ధన్యులు. ఆ కోరిక మాకూ ఉంది. మేము కూడా అక్కడ జన్మించి జ్ఞానం, వైరాగ్యం, భక్తి అనే భాగ్యాలను మనస్ఫూర్తిగా అనుభవించాలనే బలీయమైన కోరిక మాలోనూ ఉంది.
సుభాషితం-12
అపారభూమి విస్తారం అగణ్యజనసంకులం|
రాష్ట్రం సంఘటనా హీనం ప్రభవేన్నాత్మరక్షణే||
అర్థం : నివసించడానికి తుట్టతుది అన్నదే కన్పించని విస్తారమైన భూమి ఉంది. లెక్కలేనంత జనాభా ఉంది. కానీ దేశం ఐక్యత, సంఘటనానికి దూరమైనపుడు ఆత్మరక్షణ చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది. - కవిసూక్తిసుధ.
సుభాషితం-13
ప్రజాపీడన సంతాపాన్ సముద్భూతో హుతాశనః|
రాజ్ఞః కులం,శ్రియం, ప్రాణాన్ నాదగ్ధ్వా వినివర్తతే||
అర్థం : నానారకాలుగా ప్రజలను పీడించి, దాని ద్వారా అధికారమదం తలకెక్కిన పాలకుడి ఈ ద్వేషాగ్ని, ప్రజాపీడన ద్వారా కలిగే లోభమనే అగ్ని ,పాలకుడి ఐశ్వర్యాన్ని, కులాన్ని ,వంశాన్ని, ప్రాణాన్ని కాల్చేయకుండా ఆరిపోవు.
సుభాషితం-14
నిన్దేద్యో భారతం దేశం నిన్దేద్యో హైందవం మతం|
దేశద్రోహి మతద్రోహి దేశాన్నిష్కాస్యతామయం||
అర్థం : భారతదేశాన్ని నిందించినవాడు, హిందూ మతాన్ని ( ధర్మాన్ని ) నిందించినవాడు దేశద్రోహి అవుతాడు. మత ( ధర్మ ) ద్రోహి అవుతాడు. అలాంటివాడిని దేశం నుండి వెడలగొట్టాలి. - కౌండిన్యస్మ్రతి
సుభాషితం-15
నమే వాంఛాస్తి యశసి విద్వత్వే న చ వా సుఖే
ప్రభుత్వే నైవ వా స్వర్గే మోక్షేప్యానందదాయకే|
పరంతు భారతే జన్మ మానవస్య చ వా 
పశోఃవిహంగస్య చ వా జంతోః వృక్షపాషాణయోరపి||
అర్థం : కీర్తి ఆశ లేదు. పాండిత్యం, సుఖం, అధికారం - ఇవి కూడా వద్దు. మోక్షం కావాలనే అపేక్ష కూడా లేదు. అయితే పుడితే భారతదేశంలోనే పుట్టాలి. మనిషిగానో, జంతువుగానో, పక్షిగానో, క్రిమి లేదా చివరకు చెట్టు, మొక్క కనీసం రాయిగానైనా భారతదేశంలోనే జన్మించే భాగ్యం దొరకాలి. - ముక్తామణి.
సుభాషితం-16
ద్వావిమౌ పురుషౌ మూర్ఖే దుర్యోధన దశాననౌ|
గోగ్రహం వనభంగం చ దృష్ట్వా యుద్ధం పునఃపునః||
అర్థం : ఒకే ఒక అర్జునుడు తమందరినీ ఓడించి పంపినా కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిందేనన్న దుర్యోధనుడు, ఒకే ఒక వానరుడు ఎంతోమంది రాక్షసులను, తాను చూస్తుండగా తన లంక కొచ్చి చంపినా కూడా యుద్ధం జరగాల్సిందేనన్న రావణుడు - ఇరువురూ మూర్ఖులే.
సుభాషితం-17
గుణాః సర్వత్ర పూజ్యంతే పితృవంశో నిరర్ధకః|
వాసుదేవం నమస్యంతి వసుదేవం న మానవాః||
అర్థం : సద్గుణాలకు అన్నిచోట్లా గౌరవం ఉంటుంది. సద్గుణాలను సంపాదించినవారు ప్రపంచంలో విశేష గౌరవం పొందుతారు. తండ్రి గుణగానం చేసి తన పరిచయం చేయడం, తద్వారా తాను గౌరవం పొందడం నీచమవుతుంది. ప్రపంచమంతా శ్రీకృష్ణుడికి( వాసుదేవుడుకి ) నమస్కరిస్తుందే తప్ప అతడి తండ్రి అయిన వసుదేవుడికి కాదు.
- చాణక్యనీతి.
సుభాషితం-18
వీరేతిహాస విఖ్యాతం సాధుచారిత్ర్య విశ్రుతమ్|
వినా సంఘటితం రాష్ట్రం న భవేద్ బలవత్తరమ్||
అర్థం : వీరుల చరిత్రతో ప్రసిద్ధమైనా, సజ్జనుల నడవడికతో పేరుపొందినా రాష్ట్రమనేది (దేశమనేది ) సంఘటితం కాకపోతే బలశాలి కాజాలదు.
సుభాషితం-19
పుణ్యస్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః|
పాపస్య ఫలం నేచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః||
అర్థం : ప్రజలకు పుణ్యఫలం మాత్రం కావాలి. అయితే పుణ్యకార్యం చేయడానికి మనస్సు కలగదు. వారికి పాపఫలం అక్కరలేదు. కానీ పాపకార్యం చేయడాన్ని మాత్రం వదలిపెట్టరు.
సుభాషితం-20
న‌ తల్లోకే ద్రవ్యమస్తం యత్ లోభం ప్రతిపూరయేత్|
సముద్ర కల్పః పురుషో న కదాచన పూర్యతే ||
అర్థం: మానవుడి దురాశను పూర్తిగా తృప్తి పరచే ఏ వస్తువూ లోకంలో లేదు. ఎంత ఉన్నా ఇంకా కావాలి. తృప్తి లేదు. ఎందుకంటే మనిషి సముద్రం లాంటివాడు. అదెప్పటికీ పూర్తిగా నిండిపోవడం అనేది జరగదు.-మహాభారతం.
సుభాషితం-21
మన్యంతే క్షమిణం క్షామం నీచో దండ్యేన తృప్యతి|
ఇత్యుక్త్వాదత్త భగవాన్ బాణం బాణాసనం చ సః ||
అర్థం : లోకంలో బహుశా ప్రజలు క్షమాగుణాన్ని దుర్బలత్వమని భావిస్తారు. అయితే ధర్మాతిక్రమణం జరిగినపుడు నీచులను అణిచివేయడానికి క్షమాశీలురు తమ విశిష్టశక్తిని ప్రదర్శిస్తారు. దయాగుణుడైన శ్రీరాముడు సముద్రతీరంలో మూడు రోజులు లంకకు వెళ్ళడానికి దారి కోసం సముద్రుడి గురించి ఎదురు చూసినా రాకపోతే , విల్లంబులను చేబూనాడు.
సుభాషితం-22
శస్త్రం ద్విజాతిభిః గ్రాహ్యం ధర్మో యత్రోపరుధ్యతే|
ద్విజాతీనాం చ వర్ణానాం విప్లవే కాలకారితే||
అర్థం : దేశంలో ఒకవేళ ధర్మానికి వినాశపు స్థితి వస్తే , అలాంటి సందర్భంలో కేవలం శస్త్రధారులైన సైనికులేగాక, బ్రహ్మదీక్షాపరులూ చేతిలో ఉన్న కమండలం క్రిందపెట్టి ఆయుధం తీసుకోవాల్సి వస్తుంది. స్వయంగా స్వీకరించిన ధర్మాచరణం శ్రేష్ఠమే అయినా దేశానికి ప్రమాదమేర్పడినపుడు , దేశధర్మాల సంరక్షణం కోసం వాగ్యుద్ధంతోబాటు మల్లయుద్ధమూ సహకారి అవుతుంది.
సుభాషితం - 23
యథాస్త్రరహితే పుంసి వృథా శౌర్యపరిగ్రహః |
తథోపన్యాసహీనస్య వృథా శాస్త్రపరిగ్రహః ||
అర్థం : అత్యాధునిక శస్త్రాస్త్రాలు లేకపోతే శౌర్యం అప్రయోజకం.అలాగే అగాధ పాండిత్యం ఉన్నా మనసుకు నాటేలా ఉపన్యాసమివ్వలేకపోతే శాస్త్ర పరిజ్ఞానం అప్రయోజకం.
( ' వక్తృత్వకళ ' అంశం నిర్వహించేటపుడు ఈ సుభాషితం ఉదహరించవచ్చు )
సుభాషితం - 24
యస్య కృత్యం న జానంతి మంత్రం వా మంత్రితం పరే|
కృతమేవాస్య జానంతి స వై పండిత ఉచ్యతే ||
అర్థం : ఒక వ్యక్తి భవిష్యత్తులో సమాజానికి విశిష్ఠ కానుకలను ఇచ్చే విషయంలో చేసే ఆలోచన మరియు దానికొరకు ప్రస్తుతం జరిపే ఆలోచనా మథనం, వాటి రూపురేఖలను ఇతరులనుండి ఊహించడమూ సాధ్యం కాకుండా ఉండడం తదనంతరం ఆ మహత్కార్యపు పరిపూర్ణత గురించి అందరికీ తెలిశాక ఆ వ్యక్తి, వ్యక్తిత్వపు భవ్యదర్శనమవుతుంది. అతడిని నిండు హృదయంతో ఉత్తమ మేధావి ( పండితుడు ) అని శ్లాఘిస్తారు. - మహాభారతం
పరమ పూజనీయ డా. హెడ్గేవార్ ఈ శ్లోకానికి నిలువెత్తు సాక్ష్యం. ( నరేంద్ర మోడి అసలు ఏం ఆలోచిస్తున్నాడో అర్థమే కావడం లేదు. రేపు ఏం చేస్తాడోనని భయంగా ఉంది అని శరద్ పవార్ లాంటి రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను జ్ఞాపకం చేసుకోండి )
మన జీవితంలో ఏ వ్యక్తులు నిరంతర సంపర్కంలో ఉంటారో అలాంటి వారే నిజమైన బంధువులు అనేది తాత్పర్యం.
సుభాషితం - 25
ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే శత్రునిగ్రహే |
రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః ||
అర్థం : సంతోష సమయంలో ,దుఃఖంలో , కరువుకాలంలో, శత్రువుతో యుద్ధంలో, రాజద్వారంలో మరియు స్మశానంలో - ఇలా ఇంతటి సందర్భాలలో ఎవరు వెంట ఉంటారో వాళ్ళే మన నిజమైన బంధువులు.
సుభాషితం - 26
కపర్దికా మాత్ర లబ్ధైక లక్షం త్యజతి రూక్షధీః |
న చేన్నీ చైక్య లాభాయ జగత్సర్వం కథం జహౌ ||
అర్థం : అల్పమైన లాభం కోసం తన ముఖ్యమైన ఉద్దేశ్యం, ధ్యేయాలను, లక్ష్యం చేరే దారిని త్యజించేవాడు తీవ్రవాద బుద్ధి ఉన్న అవివేకుడే అవుతాడు. అలాగే తమలో మాత్రమే ఐకమత్యముంది, ఆ ఐకమత్యమే ప్రపంచాన్ని పరిపాలించాలి, నియంత్రించాలి అనే స్వార్థ ప్రయోజనం కోసం ప్రపంచాన్నంతటినీ ధ్వంసం చేయడానికి ఉద్యుక్తులైతే అది అవివేకపు పరమావధి, ఉగ్రత్వానికి పరాకాష్ఠ అంటారు. - యుక్తి మల్లికా
సుభాషితం - 27
పుస్తకేషు చ యా విద్యా పరహస్తేషు యద్ధనం|
సంగ్రామే తు పురే సైన్యం తిస్రః పుంసాం విడంబనా ||
అర్థం : పుస్తకం చేతికి ఆభరణమే అయినా అందులో ఉన్న అక్షరరూప విద్య తలలో ఉండాలి. లేకపోతే అది ఉపయోగపడదు. అలాగే ఏదైనా వస్తువు కొనాల్సిన సందర్భం వచ్చినపుడు చేతిలో డబ్బుండాలి. అయితే ఆ సమయంలో డబ్బు మరొకరి వద్ద ఉంటే ఏమిటి ప్రయోజనం? శత్రువులు దురాక్రమణం చేసినపుడు వారిని అణచివేయడానికి సైన్యం యుద్ధానికి పోవాలి. నిర్లక్ష్యంతో కూర్చుంటే అపజయం తప్పదు. అందువల్ల ఇలాంటి విషయాలలో స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి.
( చివరి అంశంలో ఈ మధ్యనే భారత్ చాలా ముందుగా హెచ్చరించినా జాగ్రత్త పడని శ్రీలంక భయంకర తీవ్రవాద దాడికి గురైంది.)
సుభాషితం - 28
నిజ వర్షాహిత స్నేహా బహుభక్త జనాన్వితాః |
సుకాలా ఇవ జాయంతే ప్రజాపుణ్యేన భూభృతః ||
అర్థం : ప్రజలు పుణ్యాత్ములూ, ధర్మపరులూ, సత్యనిష్ఠులూ అయితే, సకాలంలో వర్షం పడినట్లే , చాలామంది భక్తులను కల్గిన, ధర్మాత్ముడైన రాజు పుట్టుకొస్తాడు.
సుభాషితం - 29
భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణభారతీ |
తస్మాద్ధి కావ్యం మధురం తత్రాపి చ సుభాషితమ్ ||
అర్థం : సకల భాషలకు ప్రధానంగా , మాతృస్థానంలో ఉన్న, మధురమైన, దివ్యమైన భాష సంస్కృతం. ఒకరకంగా సంస్కృతికి సంస్కృతమే మూలపీఠం. ఇది స్వర్గపు భాషగా ప్రసిద్ధం. ఈ సంస్కృత వృక్షంలో వికసించిన సుందర పుష్పమే కావ్యం. అందులోనూ విశేషంగా సుభాషితాలు అంటే అందరి హృదయాలకు నచ్చిన మంచి మాటలు అమృతాన్ని స్రవించే ఫలాలకు ప్రతీకలు. - సువచన రత్నావళి.
సుభాషితం - 30
ఏకోహం అసహాయోహం కృశోహం అపరిచ్ఛదః |
స్వప్నేప్యేవం విధా చింతా మృగేంద్రస్య న జాయతే ||
అర్థం : నాతో ఎవరూ లేరు, నేనొక్కడినే ఉన్నందున అసహాయకుడినై ఉన్నాను. చాలా కృశించి పోయాను. నావద్ద ఎలాంటి ఆయుధాలూ లేవు. నా గతి ఇక అధోగతి - ఈ రకమైన ఆలోచన మృగరాజైన సింహానికి కలలో కూడా రాదు. అది తనలోని ప్రయత్నం, పరాక్రమాల ద్వారా సాధించి గెలుస్తుంది. అలాగే మనిషి కూడా దేవుడిని స్మరిస్తూ ప్రయత్నపూర్వకంగా యుక్తిశక్తుల ద్వారా సాధించి ఫలితాన్ని పొందాలి. - సుభాషిత రత్నమాల
సుభాషితం -31
నృపాణాం చ నరాణాం చ కేవలం తుల్య మూర్తితా
ఆధిక్యం తు క్షమా ,ధైర్యం, ఆశా, దానం ,పరాక్రమః |
ప్రజాం న రంజయేత్ యస్తు రాజా రక్షాదిభిర్గుణైః
అజాగళస్తనస్యేవ తస్య జన్మ నిరర్థకం ||
అర్థం : పాలకులకూ, పాలితులకూ శరీరం ఒకే విధంగా ఉంటుంది. ఆకారంలో అందరూ మనుష్యులే. అయితే పాలకుడికి ఎక్కువగా ఉండాల్సింది - క్షమాగుణం, ధైర్యం, సకారాత్మక ఆలోచన, ఆశావాదం, సత్యం పట్ల విశ్వాసం, దానపరత్వం, పరాక్రమం, ఉత్సాహం, శక్తి మొదలగు అసామాన్య గుణాలు. ఇవి లేకుండా ప్రజలను సుఖం, శాంతి , నెమ్మది, సమృద్ధులలో ఉంచలేని పాలకుడి జన్మ , మేక మెడలోని స్తనాల లాగా వ్యర్థం. బహుభారం కూడా.
సుభాషితం - 32
హిందుర్దుష్టో న భవతి న నార్యోనవిదూషకః |
సద్ధర్మపాలకో విద్వాన్ శ్రౌత ధర్మ పరాయణః ||
అర్థం : హిందువు దుర్జనుడు, అనార్యుడు, విదూషకుడు( నకారాత్మకంగా మాట్లాడేవాడు ) కాదు. తనదైన ధర్మాన్ని ఆచరించేవాడు, జ్ఞానం కలిగినవాడు, వేద ధర్మాన్ని రక్షించేవాడే హిందువు.రామకోశ్ అనే గ్రంథం నుండి.
సుభాషితం - 33
సువర్ణపుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయః |
శూరశ్చ కృతవిద్యశ్య యశ్చ జానాతి సేవితుమ్ ||
అర్థం : పరాక్రమం ఉన్నవాడికీ, బాగా చదువుకున్నవాడికీ, సేవాభావన ఉన్నవాడికీ మాత్రమే బంగారుపువ్వులు లభిస్తాయి. బంగారు పువ్వు అనే మాటకు అభివృద్ధి అనేది సంకేతార్థం.
సుభాషితం - 34
ఆచార్యాత్ పాద మాదత్తే పాదం శిష్య స్స్వమేధయా |
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ||
అర్థం : ప్రతి వ్యక్తి తన ఉపాధ్యాయుడి ద్వారా నాలుగో వంతు చదువును, తనంత తాను ఆలోచించి మరో నాలుగో వంతును, తోటి విద్యార్థులతో కలసి ప్రశ్నలేస్తూ ఇంకో నాలుగో వంతును, జీవితానుభవంలో మిగిలిన నాలుగో వంతును నేర్చుకుంటాడు.
సుభాషితం - 35
అణునాపి ప్రవిశ్యారిం ఛిద్రేణ బలవత్తరమ్ |
నిఃశేషం మజ్జయేత్ రాష్ట్రం పానపాత్రమివోదకమ్ ||
అర్థం : బలమైన శత్రుపక్షానికి , ప్రతిపక్షం వైపు నుండి అణుమాత్రమైనా సంకేతం లభిస్తే చాలు; ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించి ప్రతిపక్షాన్ని నాశనం చేస్తుంది. నీటిపాత్ర ఎంత పెద్దదైనా చిన్న రంధ్రం పడితే నీరంతా కారిపోతుంది. సమాజంలోని ప్రజలందరిలో దృఢత్వం, నిజాయితీ ఉంటే అది ఆ దేశపు మహాశక్తికి ప్రతీక అవుతుంది. - కామందకీయ నీతిసారం.
సుభాషితం - 36
స్వదేశే పతితే కష్టే దూరస్తా లోకయన్తియే|
నైవచ ప్రతికుర్వన్తి తే నరాః శత్రునన్దనాః||
అర్థం : దేశానికి ఆపద వచ్చినపుడు దూరంగా నిలబడి చూస్తూ ఊరకుండి, ప్రతిక్రియ కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయనివారు శత్రువులకే ఆనందం కల్గిస్తారు. అంటే అలాంటివారిని చూస్తే శత్రువులకు గొప్ప సంతోషం కలుగుతుంది.
సుభాషితం -37
విద్యా శస్త్రస్య శాస్త్రస్య ద్వే విద్యే ప్రతిపత్తయే |
ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయాద్రియతే సదా||
అర్థం : శస్త్రవిద్య, శాస్త్రవిద్య అని విద్యలలో రెండు రకాలు. ఈ రెండూ ఈ కాలంలో అత్యవసరం. గతకాలంలో క్షత్రియులు మాత్రమే ఆయుధాలను ధరించేవారు. ఇపుడు కొన్ని సందర్భాలలో అందరికీ ఆయుధం అనివార్యమవుతున్నది. అయినా ఆయుధప్రయోగం శరీరంలో శక్తి ఉన్నంతవరకే. వృద్ధాప్యంలో అది హాస్యాస్పదమవుతుంది. శాస్త్రవిద్య మాత్రం ఎల్లప్పుడూ ఆదరణీయమవుతుంది. -సుభాషిత సుధానిధి.
సుభాషితం -38
యస్యాం పూర్వే పూర్వజనా విచక్రిరే |
యస్యాం దేవా అసురా నభ్యవర్తయన్ ||
అర్థం : మనకంటే ముందు తరాల వారు మాతృభూమిని రక్షించుకోవటానికి ఏ విధంగా తమ శౌర్య పరాక్రమాలను ప్రదర్శించినారో , శత్రువులను పారద్రోలినారో , వాటికి సంబంధించిన ఇతిహాసాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవటం వల్ల మనలో మాతృభూమి పట్ల ప్రేమ అధికమవుతుంది.అధర్వణ వేదం 12- 1- 5 పృథ్వీసూక్తం.
సుభాషితం- 39
సత్యం బృహత్ ఋతం ఉగ్రం దీక్షాతపో |
బ్రహ్మయజ్ఞః పృథివీం ధారయన్తి ||
అర్థం : ప్రజలలో సత్యనిష్ఠ , జ్ఞానం , పరాక్రమం, కష్టపడటం, నైపుణ్యం, త్యాగబుద్ధి , సంధ్యావందనం(వైదిక నిత్య కర్మలను ఆచరించడం) మొదలైన గుణాలున్నపుడే మాతృభూమి స్వతంత్రంగా ఉండగలుగుతుంది.
సుభాషితం -40
వయమేవ కరిష్యామో మాతృభూమేః సుమంగళమ్ |
ప్రతిష్ఠాం ధర్మభూమిశ్చ నేష్యామః పరమోన్నతీమ్ ||
అర్థం : మనమంతా మన మాతృభూమిని మంగళకరంగా రూపొందిద్దాము. మన ధర్మభూమి భారత్ ను అత్యన్నత స్థానంలో కూర్చోబెడదాము. మనం మన మాతృభూమిని పరమోన్నత శిఖరం పైకి తీసుకెళదాము.
సుభాషితం - 41
శీలం ప్రధానం పురుషే తద్యస్యేహ ప్రణశ్యతి |
న తస్య జీవితేనార్థ న ధనేన న బంధుమిః ||
అర్థం : మనుష్యుడికి శీలమే ప్రధానం. ఒకవేళ దాన్ని కోల్పోయినట్లైతే అతని జీవితం, ధనం, ఇతర బంధాలకు అర్థమే లేదు.
సుభాషితం - 42
విదేశేషు ధనం విద్యా వ్యసనేషు ధనం మతిః |
పరలోకే ధనం ధర్మః శీలం సర్వత్ర వై ధనమ్ ||
అర్థం : ఇతర ప్రదేశాలలో మనకు విద్యే డబ్బు రూపంలో సహకరిస్తుంది. జీవితంలో దుఃఖ సందర్భాలలో బుద్ధే సంపద రూపంలో తోడ్పడుతుంది. పరలోకంలో మనకు మనం చేసిన ధర్మకార్యాలే సంపద రూపంలోఉపకరిస్తాయి. అయితే మనిషి శీలం అన్ని కాలాల్లో అన్ని దేశాలలో సంపదలాగా వెంట ఉంటుంది.
సుభాషితం - 43
వృత్తం యత్నేన సంరక్షేత్ విత్తమేతి చ యాతి చ యాతి చ |
అక్షిణో విత్తతః క్షీణో వృత్తతస్తుహతో హతః ||
అర్థం: ప్రయత్నపూర్వకంగా శీలాన్ని కాపాడుకోవాలి. ధనం ఒకసారి రావచ్చు లేదా పోవచ్చు. ధనం ద్వారా బీదవాడైనవాడు బీదవాడు కాదు. శీలంతో బీదవాడైనవాడు మాత్రం బ్రతికిఉన్నా చనిపోయినట్లే.
సుభాషితం - 44
ధర్మార్థం సంచయో యో వై ద్రవ్యాణాం పక్ష సంమ్మతః |
తపః సూతాయ ఏవేహ విశిష్టో ద్రవ్య సూచయాత్ ||
అర్థం : దేశం కాపాడబడేది ప్రోది చేసిన తపస్సు ద్వారా. అది ధర్మాన్ని రక్షిస్తుంది. మిగిలిన అన్ని ధనాలూ నాశనమై , దోచుకోబడతాయి. తపస్సును ఎవరూ దోచుకోలేరు.
సుభాషితం - 45
ధనధాన్య సుసంపన్నం స్వర్ణరత్నాది సంభవమ్ |
సుసంహితం వినారాష్ట్రం నహిస్యాత్ శూన్యవైభవమ్ ||
అర్థం : ధనధాన్య సమృద్ధితో , స్వర్ణరత్నాదులను కలిగి ఉన్నప్పటికీ సంఘటిత సమాజం లేని దేశం వైభవ సంపన్నం కాజాలదు.
సుభాషితం - 46
అసంబాధం బధ్యతో మానవానాం |
యస్యా ఉద్వతః ప్రవతః సమంబాహు ||
అర్థం : ప్రజలలో జ్ఞానులు, అజ్ఞానులు ఉండవచ్చు. సంపన్నులూ, నిరుపేదలూ ఉండవచ్చు. పెద్దపెద్ద పదవులను అధిరోహించినవాళ్ళూ, చిన్న ఉద్యోగులూ ఉండవచ్చు. కాని ఇలాంటి వ్యత్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ వారిలో ఐక్యత ఉన్నంతవరకే మాతృభూమికి రక్షణ. -పృథ్వీసూక్తం.

Post a Comment

0 Comments